దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. నిందితుల మృతదేహాలను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో భద్రపరచాలని హైకోర్టు సూచించింది. ఏసీ అంబులెన్స్ లో మృతదేహాలను తరలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. శుక్రవారం వరకు గాంధీ హాస్పిటల్ లోనే భద్రపరిచి ఉంచాలని సూచించింది.
విచారణ సందర్భంగా.. పోలీసులు నమోదు చేసిన FIRను హైకోర్టు పరిశీలించింది. ప్రభుత్వం తరపు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసిందని ఏజీ చెప్పారు. ఈ కేసులో సీనియర్ అడ్వకేట్ ప్రకాశ్ రెడ్డిని అమికస్ క్యూరీగా నియమించింది హైకోర్టు. మధ్యవర్తిగా ఆయన తమకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో.. ఆర్గుమెంట్స్ ను గురువారానికి వాయిదావేసింది హైకోర్టు.