
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై తెలంగాణ హైకోర్టు డిసెంబరు 13 వరకు స్టే విధించింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ.. వాటిపై స్టే ఇవ్వాలని కోరుతూ వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. నోటీసులపై ఈనెల 13 వరకు స్టే గడువును పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్ ను ఆదేశించింది. అయితే బీఎల్ సంతోష్ తరఫున కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీంతో వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.
అంతకుముందు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ కు సిట్ నవంబరు 23న నోటీసులు జారీచేసింది. కానీ సంతోష్ విచారణకు రాలేదు. ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ అప్పట్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబరు 25న బీఎల్ సంతోష్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. డిసెంబరు 5 వరకు స్టే కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది. ఈ తరుణంలో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఈనెల 13 వరకు హైకోర్టు పొడిగించింది.
ఈ కేసులో తనకు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులతో పాటు, లుకౌట్ నోటీసులపై స్టే కోరుతూ డిసెంబరు 3న జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇయ్యాల తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించి.. జగ్గుస్వామికి జారీ చేసిన సిట్ నోటీసులపై కూడా 13వ తేదీ వరకు స్టే విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేలడం వల్లే ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.