
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పాల్వంచ, పాల్వంచ సంస్థానం గ్రామాలతో పాటు మరో ఏడు ఏజెన్సీ గ్రామాలతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు వీలుగా వెలువడిన జీవో 103ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
కొత్తగూడెం మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ లో తీసుకువచ్చిన చట్టసవరణ రాజ్యాంగ వ్యతిరేకమని, సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను, పాల్వంచ, పాల్వంచ సంస్థానం ఏజెన్సీ గ్రామాలను కొత్తగూడెంలో కలపడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని పిటిషనర్ లాయర్ వాదించారు. ప్రభుత్వ కౌంటర్ నిమిత్తం విచారణను 2 వారాలకు కోర్టు వాయిదా వేసింది.