హైదరాబాద్, వెలుగు: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల్లో మాజీ సైనికులకు కనీస అర్హత మార్కులపై సత్వర నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అప్పటిదాకా గ్రూప్ 4లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా పోస్టులను భర్తీ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది.
డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ చేసిన రికమండేషన్స్ను పరిగణనలోకి తీసుకుని మాజీ సైనికుల కనీస అర్హత మార్కులపై ఒక నిర్ణయానికి రావాలంది. ఇందుకు అనుగుణంగా ఎక్స్ సర్వీస్మెన్లకు రిజర్వయ్యే పోస్టులను ఖరారు చేయాలంది. ఈ ఉత్తర్వులు వెలువడిన 30 రోజుల్లోగా నిర్ణయం తెలియజేయాలని తెలిపింది.