- జీవో 121పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టిక్కెట్లు కొన్నవాళ్ల నుంచి ఏ విధమైన పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని థియేటర్ల యజమానులకు సమాచారం పంపాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్లో సినిమా చూసేందుకు ఇటీవల రామావత్ ప్రేమ్ కుమార్ వెళ్తే పార్కింగ్ ఫీజు వసూలు చేశారు.
దీంతో జీవో 121ను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడంతో శనివారం జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయమన్నారు.
మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదనే ఉత్తర్వుల నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మినహాయింపును రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం 2021లో జారీ చేసిన జీవో 121 చెల్లదని, మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 176(6)కు విరుద్ధమన్నారు. వాదనల తర్వాత జీవో 121 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
