‘స్థానిక’ ఎన్నికలపై (ఇవాళ జూన్ 23న )హైకోర్టులో విచారణ

‘స్థానిక’ ఎన్నికలపై (ఇవాళ జూన్ 23న )హైకోర్టులో విచారణ
  • ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్​లనైనా కొనసాగించాలని కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్​లు
  • గత డిసెంబర్ 23న వాయిదా ఉండగా.. హియరింగ్​కు రాని ఫైల్
  • ఆరు నెలల తర్వాత బెంచ్ ముందుకు కేసు.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల అంశం సోమవారం హైకోర్టు బెంచ్​ముందుకు రానుంది. గత  ఏడాది డిసెంబర్​ 23న ‘స్థానిక’ ఎన్నికల కేసు బెంచ్​ ముందుకు రావాల్సి ఉండగా.. ఆ రోజు ఫైల్​ రాలేదు.  దీంతో అప్పటి నుంచి కేసు పెండింగ్​లోనే ఉంది. దీనికి సంబంధించి కనీస ప్రస్తావన కూడా రాలేదు. సరిగ్గా ఆరు నెలల తర్వాత ఈ నెల 23న ఈ కేసు అనూహ్యంగా తెరపై వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయనున్నదానిపై ఆసక్తి నెలకొంది. 

‘స్థానికం’పై కోర్టు ఆశ్రయించిన ఇద్దరు మాజీ సర్పంచ్​లు 

తెలంగాణలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జులై 5తో పూర్తయింది.  ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. రాజ్యాంగ ప్రకారం ఆరు నెలలలోపు లేదా ఆరు నెలల ముందైనా నిర్వహించాల్సి ఉంది. ఈ నేథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్​లు స్థానిక ఎన్నికలపై కోర్టును ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలైనా నిర్వహించండి.. లేదా పాత సర్పంచులనైనా కొనసాగించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, అటు మాజీ సర్పంచ్​లు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చిచెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. జాప్యం జరగడానికి కారణాలు తెలపాలని, డిసెంబర్​ 23 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో చీఫ్​జస్టిస్​ ముందుకు బీసీ కమిషన్, రిజర్వేషన్​ ప్రక్రియకు సంబంధించిన కేసు రావడంతో మాజీ సర్పంచ్​లు వేసిన కేసుపై కదలిక రాలేదు. ఆరు నెలల తర్వాత  మళ్లీ మాజీ సర్పంచ్​ల కేసు బెంచ్​మీదకు రానుండడంతో ‘స్థానిక’ ఎన్నికలపై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనున్నదనే  ఆసక్తిగా మారింది. గతంలో ఈ కేసు విచారణ​30వ కోర్టు జడ్జి శరత్​ ఆధ్వర్యంలో కొనసాగగా.. సోమవారం ఈ ఫైల్​ 10వ కోర్టు జడ్జి మాధవి ముందుకు రానున్నట్లు సమాచారం. 

ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సర్కార్​

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమయాత్తమవుతున్నది. ఇప్పటికే పంచాయతీరాజ్​ అధికారులు ఎన్నికల సంబంధించిన వర్క్​ పూర్తి చేశారు. వార్డుల వారీగా ఓటరు జాబితా రూపొందించారు. పోలింగ్​ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. సిబ్బంది, అధికారులకు ఎన్నికల సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు. బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పేపర్లు రెడీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చిన ఎన్నికల నిర్వహించేలా పంచాయతీరాజ్​ శాఖ గ్రౌండ్ ప్రిపేరు చేసింది.

 ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల లెక్కతేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.  గతంతో పోలిస్తే ఈ సారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారడంతో ఎన్నికల నిర్వహణకు ఇదే మంచి సమయమని భావిస్తున్నట్లు సమాచారం.