- డిక్రీ అమలుకు పోలీసు రక్షణపై మార్గదర్శకాలు రూపొందించండి
- మళ్లీ మళ్లీ హైకోర్టుకు వచ్చే పరిస్థితి ఉండొద్దని డీజీపీకి సూచన
హైదరాబాద్, వెలుగు: కింది కోర్టులు ఇచ్చిన డిక్రీల అమలుకు పోలీసు రక్షణ కల్పించే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రామాణిక నిర్వహణ విధానం) (ఎస్ఓపీ) రూపొందించే అంశాన్ని పరిశీలించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో బాధితులు మళ్లీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇలా పదే పదే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తే న్యాయపాలనపై ప్రభావం పడుతుందని పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన నల్లా వెంకటరెడ్డి.. సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన డిక్రీ అమలుకు పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు.
కింది కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో సింగిల్ జడ్జి.. భూమికి కంచె వేసుకునే సమయంలో పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పీసారి గోపయ్య అప్పీల్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం. మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కింది కోర్టు ఆదేశించినా మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. డిక్రీల అమలుకు మళ్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాకుండా ఎస్ఓపీపై పరిశీలించి చెప్పాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
