- చేవెళ్లలో జితేష్ వి.పటేల్ క్షేత్రస్థాయి పర్యటన
చేవెళ్ల, వెలుగు: విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పటేల్ వినూత్నంగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ప్రజాబాట–బస్తీబాట కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్లో పర్యటించిన ఆయన స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది పనితీరును పరిశీలించి, రైతులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఓఅండ్ఎం సిబ్బంది భద్రత కోసం పోల్ క్లైంబింగ్ పరికరాలను పంపిణీ చేశారు.
రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చేవెళ్ల ప్రాంతంలో 33 కేవీ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయనున్నట్లు జితేష్ వి.పటేల్ తెలిపారు. ఆలూర్, ధర్మసాగర్, పూడూర్ ఫీడర్ల మధ్య సుమారు 5 కిలోమీటర్ల మేర 33 కేవీ ఇంటర్లింక్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అవసరాన్ని బట్టి సబ్స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరాను మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే చేగూర్ నుంచి షాబాద్ వరకు 7 కిలోమీటర్ల మేర ఫీడర్ను విస్తరించి, షాబాద్ 33/11 కేవీ సబ్స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ డాక్టర్ నరసింహులు, రంగారెడ్డి జోన్ చీఫ్ ఇంజినీర్ గోపయ్య, సైబర్సిటీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
