మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై బీజేపీ దాడి

మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై బీజేపీ దాడి
  • కార్యాలయాన్ని తగలబెట్టేందుకు యత్నం
  • బీజేపీ ఆఫీసు, పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ ప్రతిదాడి


నల్గొండ, వెలుగు: హైదరాబాద్‌‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌‌ శ్రేణులు దాడి చేశారన్న నిరసనతో.. నల్గొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్‌‌ ఆఫీసును ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. ప్రతిగా కాంగ్రెస్‌‌ శ్రేణులు బీజేపీ జిల్లా కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌ రెడ్డి ఇంటిపై దాడులకు దిగాయి. ఇరువర్గాల పరస్పర దాడులతో నల్గొండ పట్టణంలో హైటెన్షన్‌‌ వాతావరణం నెలకొంది.

మంత్రి ఆఫీసుపైకి కోడిగుడ్లు, టమాటాలు
హైదరాబాద్‌‌ ఘటనకు నిరసనగా నల్గొండ శ్రీనగర్‌‌ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంప్‌‌ ఆఫీస్‌‌ వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆఫీసు బయట ఉన్న మంత్రి భారీ కటౌట్‌‌ను తగలబె ట్టి, ఫ్లెక్సీలను చింపివేశారు. ఆఫీసుపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. కొందరు కార్యకర్తలు క్యాంపు ఆఫీసును తగలబెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి  పీఎస్​కు తరలించారు.

ప్రతి దాడికి దిగిన కాంగ్రెస్​నాయకులు

మంత్రి ఆఫీసుపై దాడికి ప్రతీకారంగా కాంగ్రెస్‌‌ నేతలు ప్రతిదాడులకు దిగారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడి చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌‌ కార్యకర్తలు నేరుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. వర్షిత్‌‌ రెడ్డితో పాటు దాడి చేసిన బీజేపీ నాయకులు పార్టీ ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని మళ్లీ వెళ్తుండగా క్లాక్‌‌టవర్‌‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్‌‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో నల్గొండలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాయకులను ముందస్తు అరెస్ట్‌‌ చేస్తున్నారు.