
బషీర్బాగ్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై వివక్షను కేంద్ర ప్రభుత్వం విడనాడి, అభివృద్ధికి కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. బషీర్బాగ్ప్రెస్ క్లబ్లో సుప్రీంకోర్టు న్యాయవాది, జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కరణం రాజేశ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఉత్తరాది పాలకులు దక్షిణాదిపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ వివక్షను అధిగమించేందుకు దక్షిణాది ప్రజలు కేంద్రంపై ఐక్యంగా తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ముసుగులో కొన్ని శక్తులు ప్రజలను వర్గాలుగా చీల్చాయని, నేటికి అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాలకులు బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించి, సుప్రీంకోర్టు రిజర్వ్ బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.