
హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. ఏ కాలేజీలో చదివిన వాళ్లకు ఆ కాలేజీలోనే పరీక్ష నిర్వహిస్తామని, ఇన్విజిలేటర్ లు మాత్రం బయటి నుంచి వస్తారని చెప్పారు. గతంలో ఒక రూమ్ లో 40మందికి నిర్వహించగా.. కరోనా నేపథ్యంలో 20 మందిని మాత్రమే గదిలోకి అనుమతిస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థికి మద్యలో ఒక బెంచ్ ఖాళీగా వుంటుందని అన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించి పరీక్ష కు రావాల్సి ఉంటుందని చెప్పారు.
పరీక్ష రాయలేని వాళ్లకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, సర్టిఫికేట్ లో మాత్రం రెగ్యులర్ అనే వస్తుందన్నారు పాపిరెడ్డి. ప్రస్తుతం చివరి సంవత్సరం విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని, సాధ్యమైనంత త్వరగా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఒక వేళ బ్యాక్ లాగ్స్ వుంటే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎంసెట్ రాయలేని వారి గురించి ప్రభుత్వ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మొత్తం 6 యూనివర్సిటీ లలో కలిపి లక్షన్నర మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని పాపిరెడ్డి తెలిపారు.