హిమాచల్ ప్రదేశ్‎లో ఘోర ప్రమాదం..200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడిన బస్సు

హిమాచల్ ప్రదేశ్‎లో ఘోర ప్రమాదం..200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడిన బస్సు

సిమ్లా: హిమాచల్‎ప్రదేశ్‎లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మండి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడింది. సర్కాఘాట్ సమీపంలోని పాత్రిఘాట్ ప్రాంతంలో మంగళవారం (జూన్ 17) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా..  అందులో 25 మంది స్వల్పంగా గాయపడగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను నెర్చోక్ మెడికల్ కాలేజీకి తరలించి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. వర్షం కారణంగా ఘటన స్థలంలో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం తప్పడంతో పోలీసులు, ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.