బరితెగించేశారు : అమెరికాలోని దేవాలయంపై ఖలీస్తాన్ గ్రూప్ హిందూ వ్యతిరేక రాతలు, బొమ్మలు

బరితెగించేశారు : అమెరికాలోని దేవాలయంపై ఖలీస్తాన్ గ్రూప్ హిందూ వ్యతిరేక రాతలు, బొమ్మలు

ఖలీస్తాన్ గ్రూప్ మరో సారి తన కపట బుద్దిని చాటుకుంది. అమెరికాలోని ఓ హిందూ దేవాలయం గోడలపై భారత వ్యతిరేక రాతలు రాయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం గోడలపై రాసిన రాతలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పని చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

హిందూ దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసి, ఆలయ పరిసరాలను ధ్వంసం చేశారు. స్వామినారాయణ దేవాలయం గోడలపై నల్లరంగుతో అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నెవార్క్ పోలీసులు.. వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన డిసెంబర్ 22న వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెబుతుండగా, అంతకుముందు రోజు రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

We strongly condemn the defacing of SMVS Shri Swaminarayan Mandir at Newark, California with anti-India graffiti. This incident has hurt the sentiments of the Indian community. We have pressed for quick investigation and prompt action against the vandals by the US authorities in…

ఈ ఘటనపై స్పందించిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్.. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని SMVS శ్రీ స్వామినారాయణ మందిరాన్ని భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీతో పాడుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. ఈ సంఘటన భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని, అధికారులు వెంటనే స్పందించి, విచారించాలని భారత్ డిమాండ్ చేసింది.
 
విదేశీ గడ్డపై హిందూ మత స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఆలయ తలుపులకు ఖలిస్తానీ పోస్టర్లు అతికించారు. ఈ ఘటన మొత్తం ఆవరణలోని సీసీటీవీలో రికార్డయింది. ఇలాంటిదే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోనూ వెలుగుచూసింది.