సర్కారు వారి పాట ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్లో మెగా వేలానికి హెచ్ఎండీఏ రెడీ

సర్కారు వారి పాట ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్లో మెగా వేలానికి హెచ్ఎండీఏ రెడీ
  • కోకాపేట, మూసాపేటలో అమ్మకానికి 43 ఎకరాలు
  •     నియో పోలీస్ లేఅవుట్​లో 27, గోల్డెన్ మైల్​లో 1.98, మూసాపేటలో 14 ఎకరాలు
  •     ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 1.98 నుంచి 5.31 ఎకరాలు
  •     17న రాయదుర్గంలో ప్రీబిడ్ మీటింగ్
  •  నవంబర్ 24 నుంచి  ఈ - వేలాలు షురూ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ మరోసారి భారీ ఎత్తున భూముల వేలానికి రెడీ అయ్యింది. ఈసారి ఏకంగా 43.64 ఎకరాల్లో మెగా వేలం నిర్వహించనున్నట్లు సోమవారం నోటిఫికేషన్​జారీ చేసింది. ఇటీవల టీజీఐఐసీ రాయదుర్గం వద్ద నిర్వహించిన భూముల వేలానికి మంచి స్పందన వచ్చింది. ఎకరం రూ.177 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లేఅవుట్​లో మిగిలిపోయిన 27 ఎకరాలు, గోల్డెన్ మైల్ లేఅవుట్​లో 1.98 ఎకరాలు, మేడ్చల్ జిల్లా మూసాపేట వై జంక్షన్ వద్ద 14.66 ఎకరాలు వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. 

అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని ఈ వేలం నిర్వహిస్తున్నది. ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలికే అవకాశం కన్పిస్తున్నది. తాజా వేలానికి బిడ్డింగ్ లోనే సర్కారు వారి పాటను కోకాపేటలో ఎకరానికి రూ.99 కోట్లు, గోల్డెన్​మైల్ లేఅవుట్​లో రూ.70 కోట్లు, మూసాపేటలో రూ.75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. 

అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియోపోలిస్​ లేఅవుట్​లో భూములకు భారీ ఎత్తున ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎయిర్​పోర్ట్​కూడా 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

హైరైజ్​భవనాల కోసం అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ లేఅవుట్ రూపు దిద్దారు. ఇక్కడి భూములను 4 ఎకరాల నుంచి 5.31 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. నియోపోలిస్​ లేఅవుట్​లో ప్లాట్లను పొందడానికి ఇంతకు ముందు అంతర్జాతీయ వ్యాపారులు, దిగ్గజ రియల్టర్లు, డెవలపర్లు పోటీ పడ్డారు. 

ఈసారి కూడా అదే స్థాయిలో డిమాండ్​ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 2021లో 1 నుంచి 5 ప్లాట్లను విక్రయించగా, 2023లో 6 నుంచి 14 ప్లాట్లను అమ్మారు. తాజాగా జరిగే వేలంలో 15 నుంచి 20 నంబర్ల ప్లాట్లను విక్రయించనున్నారు. ఈ నెల 24, 28, డిసెంబరు 3, డిసెంబరు 5 తేదీల్లో వేలం పాటలు జరగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 17న రాయదుర్గంలోని టీహబ్​లో ప్రీబిడ్​ సమావేశం
 నిర్వహించనున్నారు.

ఆకాశమే హద్దుగా నిర్మాణాలకు అనుమతి

కోకాపేటలోని నియోపోలిస్​ లేఅవుట్​లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్​లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్​ట్రాక్స్​, 45 మీ. వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్​ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్​టైన్​మెంట్​ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.