
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో ప్లాట్ల వేలానికి అధికారులు బ్రేక్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు భూముల వేలం నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన భూముల వేలానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. దీని కోసం గత కొన్ని రోజులుగా ప్లానింగ్, ఎస్టేట్ అధికారులు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రభుత్వ భూములను వేలం వేయడమే ప్రధాన అంశంగా గత ప్రభుత్వం నిర్వహించిన వేలాల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేసేందుకే భూముల వేలం నిర్వహించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కోకాపేట లాంటి ప్రాంతాల్లో భూముల ధరలు వేలంలో రూ.కోట్ల రూపాయలు పలికాయి. ఒక దశలో ఎకరానికి రూ.100 కోట్ల వరకు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు, కొత్తగా లేఅవుట్లు వేసేందుకు అధికారులు పలువురు రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను సేకరించారు. వీటిని వేలం వేయడం ద్వారా హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంది.
పలు చోట్ల రైతుల భూముల సేకరణ..
హైదరాబాద్ సిటీ శివారులో ప్రణాళికాబద్ధమైన అర్బనైజేషన్కు హెచ్ఎండీఏ కార్యాచరణను రూపొందించింది. అందులో భాగంగానే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను సేకరించి, సకల సౌకర్యాలతో లేఅవుట్లు వేసింది. ఆ తర్వాత వాటిని వేలం వేసింది. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాప సింగారం, ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల పెద్ద సంఖ్యలో భూములను సేకరించింది. ప్రతాప సింగారంలో గత ఆరు నెలల కింద ఒకే చోట 130 ఎకరాలను సేకరించింది. ఇందులో రైతుల నుంచి సేకరించిన భూములే ఎక్కువగా ఉన్నాయి. 130 ఎకరాల్లో సర్వే చేపట్టేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ భూములకు సంబంధించి రైతులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని లేఅవుట్లను సిద్ధం చేసింది. దాంతో పాటు బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వేసి వేలానికి సిద్ధమైంది. ఎన్నికలకు ముందే ఈ భూ దందాపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ప్రభుత్వం అభివృద్ధిని పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోందని ఫైర్ అయింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఆరోపణలను పట్టించుకోకపోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యథేచ్చగా నిర్వహించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, హెచ్ఎండీఏఅధికారులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు.
హెచ్ఎండీఏ భూములపైనా నివేదిక..
రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏపై త్వరలో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు భూములపై నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేలం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయం రాగా.. ఆ మొత్తాన్ని గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. దీనిపై కూడా అధికారులు నివేదిక రెడీ చేస్తున్నారు. భూముల వేలం ద్వారా వచ్చిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు వినియోగించినట్టు చెబుతున్నారు. మరోవైపు, హెచ్ఎండీఏకు సంబంధించిన భూములు కూడా అనేక ప్రాంతాల్లో ఆక్రమణకు గురయ్యాయి. వీటిని ఏ విధంగా తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న దానిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. రైతుల నుంచి ఎంత భూమి సేకరించారు? అందులో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అన్న విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనున్నారు. పదేండ్లలో హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల సేకరణ, లే అవుట్ల వివరాలు, వేలం వేసిన భూముల సమాచారంతో నివేదికను రెడీ చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నారు.
కమిషనర్ అర్వింద్ కుమార్ ఔట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెచ్ఎండీఏ కమిషనర్గా అర్వింద్ కుమార్ పని చేశారు. ఆయన హయాంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనపై బదిలీ వేటు తప్పదని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. అర్వింద్ స్థానంలో వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన దాన కిషోర్ను హెచ్ఎండీఏ కమిషనర్గా నియమించింది.