
కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి ప్రెస్టీజియస్ సినిమాలతో మెప్పించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ.. క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’పేరుతో ఏడు యానిమేషన్ సినిమాలను నిర్మిస్తోంది.
తాజాగా ఆ వివరాలను వెల్లడించడంతో పాటు వాటిలో ముందుగా వస్తున్న ‘మహావతార్ నరసింహా’ ఫస్ట్ సింగిల్ ‘రోర్ ఆఫ్ నరసింహా’ను విడుదల చేశారు. సామ్ సి.ఎస్ కంపోజ్ చేయడంతో పాటు రాకేందు మౌళితో కలిసి సాహిత్యాన్ని అందిస్తూ పాడాడు. విష్ణుమూర్తి దశావతారాలపై వస్తున్న ఈ చిత్రాలను రెండేళ్లకు ఒకటి చొప్పున విడుదల చేయబోతున్నారు.
మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహా’ ఈ ఏడాది జులై 25న ఐదు భాషలలో త్రీడీ ఫార్మాట్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకుడు. 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి - పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి - పార్ట్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.