
హాంకాంగ్: ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్--–చిరాగ్ షెట్టి హాంకాంగ్ ఓపెన్లో టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు. మెన్స్ సింగిల్స్లో లక్ష్య, డబుల్స్లో సాత్విక్ –-చిరాగ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన సెమీ ఫైనల్లో 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 23–-21, 22-–20తో చైనీస్ తైపీకి చెందిన తొమ్మిదో ర్యాంకర్ చౌ టైన్ చెన్పై అద్భుత విజయం సాధించాడు.
56 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠ పోరులో 23 ఏండ్ల సేన్ కీలక సమయాల్లో సత్తా చాటాడు. పోటాపోటీగా జరిగిన తొలి గేమ్లో ఒకానొక దశలో ఇద్దరు 19–-19తో సమంగా నిలిచారు. ఆ తర్వాత 51 షాట్ల సుదీర్ఘ ర్యాలీలో చౌ షటిల్ను నెట్కు కొట్టడంతో లక్ష్య పాయింట్ సాధించాడు. అయితే, గేమ్ పాయింట్ల వద్ద ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.
చివరకు నెట్ కార్డ్ అదృష్టం కలిసిరావడంతో లక్ష్య ఈ గేమ్ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్లో కూడా పోరు తీవ్రంగా సాగింది. చౌ 17–-14 ఆధిక్యంలో ఉన్నప్పటికీ లక్ష్య అద్భుతంగా పుంజుకున్నాడు. రెండు గేమ్ పాయింట్లను కాపాడుకుని స్కోరును 20-–20తో సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో లక్ష్య సేన్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్తో తలపడనున్నాడు. మరోవైపు, మెన్స్ డబుల్స్లో 9వ ర్యాంక్ జోడీ సాత్విక్–-చిరాగ్ సెమీస్ గండాన్ని దాటింది.
ఈ సీజన్లో వరుసగా ఆరు సెమీఫైనల్స్లో ఓటమిపాలైన ఈ జంట ఎట్టకేలకు తుదిపోరుకు చేరుకుంది. సెమీస్లో 21-–17, 21–-15 వరుస గేమ్స్లోబింగ్-వీ లిన్– చెన్ చెంగ్ -కువాన్ (చైనీస్ తైపీ) ద్వయంపై ఈజీగా గెలిచింది. తొలి గేమ్లో 12-–12 వద్ద స్కోరు సమం అయినప్పటికీ, ఆ తర్వాత సాత్విక్ తన పదునైన స్మాష్లతో, చిరాగ్ చురుకైన ఆటతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి గేమ్ను గెలుచుకున్నారు. రెండో గేమ్లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా దూకుడును కొనసాగించి మ్యాచ్ను ముగించారు. ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్లు లియాంగ్ వీ కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా)తో ఇండియా జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.