అమెరికా వార్నింగ్ ఇచ్చినా తగ్గట్లేదు .. ఎర్రసముద్రంలో మరోసారి హౌతీల దాడి

అమెరికా వార్నింగ్  ఇచ్చినా తగ్గట్లేదు .. ఎర్రసముద్రంలో మరోసారి హౌతీల దాడి

ఎర్ర సముద్రంలో  వాణిజ్య నౌకలపై దాడులు చేయొద్దని అమెరికా హెచ్చరించినా మరోసారి హౌతీ రెబల్స్ రెచ్చిపోయారు. దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా,చైనా ,జపాన్ సహా 12 దేశాలు మోమోన్ లోని  హౌతీకి వార్నింగ్ ఇచ్చినా మరుసటి రోజే జనవరి 4న   ఓ డ్రోన్ బోట్ తో పేలుడుకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని యూఎస్ నేవీ వెల్లడించింది.  

ఇరాన్ మద్దతు ఉన్న ఈ హౌతీలు 2023 నవంబర్ నుంచి షిప్పులపై దాడులు చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయోల్ దాడులకు నిరసగా ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఇజ్రాయెల్– హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీ రెబెల్స్ ఇటీవల ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు చేస్తున్నాయి. హమాస్​కు మద్దతుగానే హౌతీలు ఇజ్రాయెల్​తో సంబంధాలు ఉన్న నౌకలను టార్గెట్ చేసుకుంటున్నారు. హౌతీలకు ఇరాన్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలకు అమెరికా, దాని మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. దాడులు చేయడం, నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం వంటివి కొనసాగితే మరోసారి హెచ్చరికలు ఉండబోవని తేల్చిచెప్పాయి.

బుధవారం ఈ మేరకు అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. హౌతీలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. హౌతీలకు వాణిజ్య నౌకలపై దాడులతో గ్లోబల్ ఎకానమీకి, సెయిలర్ల ప్రాణాలకు ముప్పు కలిగితే సహించబోమని పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడులను చైనా కూడా ఖండించింది. కానీ ఇరాన్​తో సన్నిహిత సంబంధాల కారణంగా హౌతీలను ప్రస్తావించకుండానే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియా ముందు తూతూమంత్రంగా ప్రకటన చేశారు.