- 66 వేల కోట్లకు పైగా ఖర్చు
- న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే 5 రెట్లు పెద్దది
బీజింగ్: నిర్మాణ సామర్థ్యాన్ని చైనా మరోసారి ప్రపంచానికి చాటుకుంది. అతి కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను నిర్మించింది. కేవలం 38 నెలల్లోనే ‘చాంగ్కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’ను పూర్తి చేసింది. ఈ భారీ ప్రాజెక్టు విజయానికి రోబో ఆర్మీని వినియోగించడమే ప్రధాన కారణమని చైనా అధికారిక మీడియా గురువారం వెల్లడించింది. రూ.66 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్.. న్యూయార్క్లోని ప్రసిద్ధ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే ఐదు రెట్లు పెద్దది. మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 15 ప్లాట్ఫామ్లు, 29 ట్రాక్లు, 8 అంతస్తులతో ఉన్న ఈ రైల్వే స్టేషన్.. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం కలిగి ఉంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఈ స్టేషన్ నిర్మాణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది.
అబ్బురపరిచే రూఫ్టాప్ నిర్మాణం
చైనాలోని అతిపెద్ద నగరమైన చోంగ్కింగ్లో ఓ భారీ పర్వతాన్ని తొలిచి ఈ స్టేషన్ను నిర్మించారు. 40 వేల మంది కార్మికులు రాత్రీపగలు పనిచేసి ఈ మెగా ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. స్టేషన్ నిర్మాణంలో 16 వేలకుపైగా టన్నుల బరువున్న స్టీల్ రూఫ్ను ముందుగా నేలపై ఫిట్ చేశారు. ఆపై హైడ్రాలిక్ లిఫ్టింగ్ టెక్నాలజీ, ప్రత్యేక రోబోటిక్ క్రేన్లను ఉపయోగించి 57 మీటర్ల ఎత్తులో బిగించారు. కొలతల విషయంలోనూ ఇంజనీర్లు పూర్తిగా ఏఐ టెక్నాలజీని వాడారు. ఈ రూఫ్ను నిలబెట్టే పిల్లర్ల నిర్మాణంలోనూ చైనా ప్రత్యేకతను చాటుకుంది. చోంగ్కింగ్ నగర చిహ్నమైన హువాంగ్జీ చెట్టు ఆకారంలో పిల్లర్లను వేశారు. 41 మీటర్ల ఎత్తు ఉండే ఈ పిల్లర్లను భారీ భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. ఈ స్తంభాలు చెట్టు కొమ్మల్లా విస్తరించి ఉండటంతో స్టేషన్లోపలికి వెలుతురు రావడమే కాకుండా పైకప్పు బరువును సమానంగా పంపిణీ చేసేలా డిజైన్ చేశారు.
