
కరోనా మహమ్మారి కాలం నుంచి దేశంలో చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తు్న్నారు. ప్రధానంగా చాలా మంది దీనిని ఒక అదనపు ఆదాయ వనరుగా భావిస్తుండగా.. కొందరు మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా కొనసాగిస్తున్నారు. దీనికి తోడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు లేదా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లయితే ఎంత డబ్బు కనీసం అవసరమే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో చాలా మంది ప్రజలు కనీసం రూ.10వేల నుంచి రూ.20 వేలు ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మెుత్తంతో వారు అనుకున్న పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు. అలాగే ముందు మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్న విషయం కంటే మీకు మార్కెట్లపై ఎంత అవగాహన ఉంది, మార్కెట్లతో ఎంత అనుబంధాన్ని కలిగి ఉన్నారనే విషయం ముఖ్యం. పైగా పోర్ట్ ఫోలియోను కనీసం రోజుకు ఒక్కసారైనా గమనించుకుంటుండాలి. పెట్టుబడి పెట్టిన స్టాక్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటిని ప్రభావితం చేస్తున్న వార్తలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించుకుంటుండాలి.
ఉదాహరణకు మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్ మల్టీబ్యాగర్ రాబడిని అందిస్తే రెండేళ్లలో డబుల్ అవ్వొచ్చు. అంటే మీ రూ.20వేలు పెరిగి రూ.40వేలుగా అవుతుంది. అదే పొరపాటున మీరు గమనించుకోకపోతే నష్టాలు కూడా అలాకే షాక్ కి గురిచేస్తాయి. అయితే కనీసం పెట్టుబడిని ఒక లక్ష రూపాయలతో స్టార్ట్ చేయటం మంచిది. రూ.లక్షతో పోర్ట్ ఫోలియోను సృష్టించటం ఆ తర్వాత మీ ఆదాయాలకు అనుగుణంగా దానిని పెంచుకోవటం ఉత్తమ మార్గం.
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి ఫార్ములా:
లక్ష రూపాయల కనీస పెట్టుబడితో పోర్ట్ ఫోలియోను సృష్టించాలని భావిస్తే 50:30:20 విధానంలో దానిని విభజించి పెట్టుబడి పెట్టడం మంచిది. లక్షలో రూ.50వేలు లార్జ్ క్యాప్ షేర్లలో, రూ.30వేలను మిడ్క్యాప్ స్టాక్స్ లో అలాగే రూ.20వేలను స్మాల్క్యాప్ కంపెనీ షేర్లలో పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం. ఇందుకోసం కనీసం 10 వివిధ కంపెనీ షేర్లను ఎంపిక చేసుకుని అందులో పెట్టుబడులు ఉత్తమం. దీని నుంచి మంచి రాబడిని పొందటానికి కనీసం 5 ఏళ్ల గడువుగా పెట్టుకోవాలి. అయితే ఈ మెుత్తాన్ని ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా స్టాక్స్ ఎంపిక చేసుకుంటూ పెట్టుబడిని కొనసాగించటం ఉత్తమం.
ఈ పెట్టుబడిని గమనిస్తూ దానిపై కనీసం 10 నుంచి 20 శాతం రాబడిని పొందగలితే మీరు మంచి మెుత్తంలో డబ్బును కూడపెట్టడానికి అవకాశం ఉంటుంది. అసలు మీకు మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే తొలుత నేర్చుకోవటానికి ఒకటి రెండు షేర్లలో చాలా తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడుతూ దానిని అర్థం చేసుకోవటం మంచిది. అలాగే ప్రతిరోజూ మార్కెట్ల గురించి అర్థం చేసుకోవటం, వాటి పనితీరు గురించి తెలుసుకోవటం, ఏఏ అంశాలు మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయో గమనిస్తూ ముందుకు సాగటం మిమ్మల్ని మంచి ఇన్వెస్టర్లుగా తీర్చిదిద్దటంలో సహాయకారిగా నిలుస్తుంది.
అయితే లక్ష కంటే తక్కువగా డబ్బులు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ఇందులో నెలవారి క్రమం తప్పకుండా రూ.500 నుంచి రూ.1000 వరకు ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు సైతం మంచి రాబడులను దీర్ఘకాలంలో తెచ్చిపెడతాయి.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.