- గోదావరి బోర్డు తీరుపై తెలంగాణ అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సబ్ కమిటీలో మెంబర్స్గా ఉన్న రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు సభ్యులు సందర్శించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ సోమవారం లేఖ రాశారు. తెలంగాణ, ఏపీకి కామన్ ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగును బోర్డు నిర్వహణకు అప్పగించడానికే 12వ జీఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించామన్నారు. సబ్ కమిటీ సభ్యులు లేకుండా ఆయా ప్రాజెక్టులు, ఔట్లెట్లను ఎలా సందర్శిస్తారని ప్రశ్నించారు. బోర్డు చైర్మన్, సభ్యులు, ఇతర అధికారులు కాకతీయ కాలువపై ఉన్న గీసుగొండ క్రాస్ రెగ్యులేటర్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్, గందమల్ల రిజర్వాయర్కు నీటిని తరలించే క్రాస్ రెగ్యులేటర్లను సందర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దవాగు తప్ప తెలంగాణ భూభాగంలోని మరే ప్రాజెక్టును జీఆర్ఎంబీ నిర్వహణకు ఇవ్వడానికి తాము అంగీకరించలేదని తేల్చిచెప్పారు. సబ్ కమిటీలో సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టులను సందర్శనతో పాటు వాటి స్వాధీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం తమకు అంగీకారం కాదని లెటర్లో స్పష్టం చేశారు.