కేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు 

కేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు 

తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఓ భార్యాభర్తలు క్షుద్రపూజలు చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. డెడ్ బాడీలను ముక్కలుగా నరికి పాతిపెట్టారు. రాష్ట్రంలోని పథనంథిట్ట జిల్లా తిరువళ్లకు చెందిన మసాజ్ థెరపిస్ట్ భగవంత్ సింగ్, లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీళ్లు.. మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మారు. ఇద్దరు మహిళలను బలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు కోటీశ్వరులమవుతామని భావించారు. ఈ క్రమంలో జూన్​లో రోసెలిన్, సెప్టెంబర్​లో పద్మ అనే మహిళలను తమ ఇంట్లో గొంతు కోసి చంపారు. వాళ్ల డెడ్ బాడీలను ముక్కలుగా నరికి తిరువళ్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పాతిపెట్టారు. హత్యకు గురైన ఇద్దరు మహిళలది ఎర్నాకులం జిల్లా అని పోలీసులు చెప్పారు. వయసు 50 ఏండ్లు ఉంటుందని పేర్కొన్నారు. వీళ్లను రషీద్ అలియాస్ మహమ్మద్ షఫీ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి దంపతుల ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులు ముగ్గురిని మంగళవారం అరెస్టు చేశామని వెల్లడించారు. 

మిస్సింగ్ కేసు దర్యాప్తుతో వెలుగులోకి.. 
పోయిన నెలలో పద్మ కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె ఫోన్లు మహమ్మద్ షఫీ దగ్గర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య విషయం బయటపడింది. అనంతరం దంపతులను విచారించడంతో తాము మరో హత్య కూడా చేసినట్లు ఒప్పుకున్నారు. ‘ఈ కేసులో చాలా కోణాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నరబలి ఇచ్చినట్లు గుర్తించాం’ అని కొచ్చి పోలీసులు తెలిపారు.