నిందితుడి ఆత్మహత్యా యత్నం
గచ్చిబౌలి, వెలుగు: ఇల్లరికం వెళదామన్నందుకు భార్య, ఏడాదిన్నర కొడుకును హత్య చేసిన సంఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా రాంపురం గ్రామానికి చెందిన అనంతప్ప అలియాస్ చిన్నాకు అదే జిల్లా వనగిరి గ్రామానికి నాగప్ప, లక్ష్మీల కుమార్తె మహదేవమ్మ(25)తో 2010లో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో చిన్నా అత్తగారి ఇంట్లోనే కాపురం పెట్టాడు. వీరికి కుమార్తెలు అనురాధ(6), అర్చన(2), కుమారుడు ఆకాశ్(18 నెలలు) సంతానం. అనంతప్ప రెండేళ్ల క్రితం భార్య పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చాడు. గచ్చిబౌలి గోపన్పల్లిలోని ఎన్టీఆర్నగర్లో అద్దెకు ఉంటున్నాడు. పెద్ద కూతురు కర్నాటకలో నానమ్మ దగ్గర ఉంటోంది.
అనంతప్ప కొన్నిరోజులపాటు ట్రాక్టర్డ్రైవర్గా పనిచేసి అనంతరం ఇంటి ఓనర్వద్దే ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. మద్యానికి అలవాటుపడ్డ అనంతప్పను పది రోజుల క్రితం ఆటో యజమాని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మహదేవమ్మ తిరిగి తమ ఊరికి వెళ్లి అక్కడే కాపురం చేద్దామని భర్త అనంతప్పకు చెబుతుండేది. భార్యభర్తల మధ్య ఇల్లరికంపై కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. బుధవారం వేకువజామున 5 గంటల సమయంలో నిద్రపోతున్న భార్య మహదేవమ్మ, కుమారుడు ఆకాశ్ల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఉదయం7 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి పైకప్పు రాడ్డుకు ఉరేసుకోవడానికి ప్రయత్నించగా తాడు తెగిపోయింది. దీంతో వాటర్హీటర్వైర్కట్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కరెంట్షాక్తో గాయపడ్డ అనంతప్పకు ట్రీట్మ్మెంట్అందిస్తున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూతురిని వదిలేసిండు
ఇల్లరికానికి వెళితే తన భార్య, కుమారుడు తన వంశం కాబట్టి పరువు పోతుందని, అందుకే భార్య మహదేవమ్మ, కుమారుడు ఆకాశ్లను హతమార్చినట్లు అనంతప్ప పోలీసులకు తెలియజేశాడు. కుమార్తె అర్చన(3)కు తన వంశంతో సంబంధం లేదని, అందుకే హత్య చేయలేదని పేర్కొన్నాడు.