టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్రావుకు హుజూరాబాద్ బైపోల్ అగ్ని పరీక్షలా మారింది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా హరీశ్కు అప్పగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వ్యూహాత్మకంగా దూరం ఉంచారు. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్రావు రెండున్నర నెలలుగా సిద్దిపేటలోనే మకాం పెట్టి.. అక్కడి నుంచే రోజూ హుజూరాబాద్ రాజకీయాలకు సంబంధించి చక్రం తిప్పుతున్నారు. ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ టార్గెట్ పెట్టడంతో.. ఇటు లోకల్గా పార్టీ నేతలను కాపాడుకోవడంతోపాటు, అటు ఈటల అనుచరులకు వల వేసేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇంతగా ప్రయత్నిస్తున్నా నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతే అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హరీశ్ సతమతమవుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తనకు ఇచ్చిన హుజూరాబాద్ టాస్క్ను పూర్తి చేసేందుకు హరీశ్రావు శ్రమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్న ఈటల రాజేందర్తో ఆయన ‘నువ్వా నేనా’ అన్నట్లుగా తలపడుతున్నారు. టీఆర్ఎస్ను గెలిపించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఈటల బర్తరఫ్ అయ్యేంత వరకు ఈటలకు, హరీశ్కు మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. తనతో పాటు హరీశ్ కూడా టీఆర్ఎస్లో ఎన్నోసార్లు అవమానాలకు గురైనట్లు ఈటల ఇటీవల గుర్తుచేసుకున్నారు. అయితే.. కేబినెట్ నుంచి ఈటలను తప్పించిన తర్వాత హరీశ్కు సీఎం కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చి హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ సెగ్మెంట్లో ఈటలకు దీటైన సెకండ్ కేడర్ పార్టీలో లేకపోవటంతో హరీశ్ పరేషాన్ అవుతున్నారు.
రోజూ సిద్దిపేటలో మీటింగ్లు
ఈటల గెలిస్తే రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు, వీలైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు తలుపులు తెరిచారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా సరే తనకు కేసీఆర్ అప్పగించిన టాస్క్ను నెరవేర్చేందుకు హరీశ్ వ్యూహాలకు పదును పెట్టారు. రోజూ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలను సిద్దిపేటకు రప్పించుకొని సమావేశమవుతున్నారు. రెండు నెలలుగా మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ హుజూరాబాద్లో ఊరూరా తిరుగుతున్నారు. పలువురు మంత్రులు కులాలవారీగా మీటింగ్లు పెట్టి వచ్చారు. ఇటీవల మాజీ ఎంపీ రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కౌశిక్రెడ్డి, స్వర్గం రవి టీఆర్ఎస్లో చేరారు. ఈటల మాజీ అనుచరుడు బండ శ్రీనివాస్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. వీరందరినీ పార్టీలోకి రప్పించడంలో, బండ శ్రీనివాస్కు పదవి ఇప్పించడంలో హరీశ్ చక్రం తిప్పారు.
హుజూరాబాద్ టాస్క్ హరీశ్కు కత్తిమీద సాములా మారింది. ఉద్యమంలో కలిసి పని చేయటం, పార్టీలో ఎంతోకాలం తనతో కలిసి మెలిగిన ఈటలపై బాహాటంగా ఆరోపణలు, విమర్శలు చేసేందుకు హరీశ్ వెనుకడుగు వేస్తున్నారు. వరుసగా గెలిచిన ఈటలకు సొంత సెగ్మెంట్లో గట్టి పట్టుంది. ప్రజల్లో సానుభూతి ఉంది. అనారోగ్యంతో ఈటల హాస్పిటల్లో ఉండగా.. వీల్ చైర్లోనైనా ఈటల ప్రచారానికి రాగలరని, ఆయన ఎత్తుగడలకు ప్రజలు మోసపోవద్దంటూ హరీశ్ చేసిన కామెంట్లు విమర్శలపాలయ్యాయి. ఈ కామెంట్లు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఈటల కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపైనా స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం గుర్రుగా ఉంది. దళితబంధుతో పాటు బైపోల్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా.. మాజీ మంత్రి సహా ముఖ్య నేతలందరినీ గులాబీ గూటికి చేర్చినా హుజూరాబాద్లో పార్టీకి ఎడ్జ్ రాలేదనే అసహనంతోనే హరీశ్రావు హుజూరాబాద్లో అడుగుపెట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బై పోల్లో టీఆర్ఎస్ ఓడితే పరోక్షంగా ఈటలకు సహకరించారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం హరీశ్ను వెంటాడుతోంది. దుబ్బాక తర్వాత రెండో ఓటమి ఎదురైతే భవిష్యత్తులో పార్టీలోనూ హరీశ్కు ప్రాధాన్యం తగ్గవచ్చని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు.