హుజురాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో 340 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. రాంపూర్లోని తిరుమల ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 340 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో రెండు ట్రాలీ ఆటోల్లో మిల్లుకు తరలిస్తున్న సుమారు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ మండలాల్లోని రేషన్ డీలర్లు, చిన్న వ్యాపారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లులో రీసైక్లింగ్ చేసి ప్రైవేట్లో ఎక్కువ ధరకు అమ్ముతూ భారీ మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. మిల్లు యజమాని ఉపేందర్కు సమీప బంధువైన శీల శీను అనే వ్యాపారి ఈ అక్రమ దందాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
