
బషీర్బాగ్, వెలుగు: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బత్తిని అమర్నాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జూన్ 8 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం జూన్ 9 ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడే రోగులకు తమ కుటుంబం దాదాపు రెండు శతాబ్దాలుగా ఉచితంగా చేప ప్రసాదం అందిస్తున్నదని గుర్తు చేశారు. గతేడాది 2.5 లక్షల మంది ప్రసాదం తీసుకోగా.. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు.చేప ప్రసాదం పంపిణీ సజావుగా సాగేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, పోలీసు, విద్యుత్, మత్స్య శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు అమర్నాథ్ వివరించారు.
మత్స్య శాఖ ఈ ఏడాది 1.25 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచనుందని.. గతేడాది ఒక్కో చేపకు రూ. 40 చెల్లించగా, ఈ ఏడాది ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 200 మంది వాలంటీర్లు రోగులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తారని చెప్పారు. అత్యవసర వైద్య సౌకర్యాలు, క్యూ లైన్లో ఇబ్బందులు తొలగించే ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రసాదం కోసం వచ్చే వారి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత భోజనం అందించనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు, గ్లౌస్లు ధరించి, చేతులు శుభ్రం చేసుకుంటూ ప్రసాదం పంపిణీ చేస్తామని అమర్నాథ్ వెల్లడించారు. చేప ప్రసాదం తీసుకున్న వారు 45 రోజుల పాటు నిర్దిష్ట ఆహార నియమాలను పాటించాలని, గర్భిణీ స్త్రీలు తప్ప అందరూ ప్రసాదం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
1.5 లక్షల చేపలు సిద్ధం చేశాం: మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ: చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ ఏడాది కూడా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందని, పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 1.5 లక్షల చేప పిల్లలు అందించనున్నట్లు తెలిపారు.
క్యూ లైన్ లో ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అదనపు కౌంటర్లు పెట్టాలని, మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. వలంటీర్లకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలన్నారు. సూచించారు. సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, రెవెన్యూ, బత్తిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.