కరోనా వ్యాప్తి: హైదరాబాద్ లో హైరిస్క్

కరోనా వ్యాప్తి: హైదరాబాద్ లో హైరిస్క్

రాష్ట్రంలో కరోనాకు హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారిపోయింది. రోజురోజుకూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు బయట పడ్తుండటంతో భయం భయంగా బతకాల్సిన పరిస్థితి. అన్ని జోన్లకు, ఏరియాలకూ వైరస్ విస్తరించింది. సోమవారం ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ లో ఏకంగా 713 పాజిటివ్‌‌ కేసులు వచ్చాయి. సిటీకి ఆనుకొని ఉన్న రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సం గారెడ్డిలో 12 పాజిటివ్‌ ‌కేసులు.. మొత్తం 848 కేసులు ఇక్కడే వచ్చాయి. రోజూ నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎనభై, తొంభై శాతం ఇక్కడివే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 8,674 కాగా.. ఇందులో గ్రేటర్‌‌ హైదరాబాద్ లోనివే 6,276 (72.3%). ఇందులో గత వారం రోజుల్లో వచ్చి నవి 2,840 కేసులు. జీహెచ్ఎంసీ సహా చాలా సర్కారీ ఆఫీసులు, గవర్నమెంట్ హాస్పిటళ్లోలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భయంతో ఆఫీసులకు వెళ్తున్నారు. దుకాణాల వాళ్లు టెన్షన్ పడ్తున్నరు. మరోవైపు ఊర్లలోవాళ్లు హైదరాబాద్ అంటేనే జడుసుకుంటున్నరు. హైదరాబాద్ కు రావాలన్నా.. ఇక్కడి నుంచి వెళ్లినోళ్లను చూసినా భయపడ్తున్నరు.

పాజిటివ్ రేటు పెరిగింది

మార్చి2న మొదటి కేసుతో గ్రేటర్‌‌ హైదరాబాద్ లో కరోనా కలకలం మొదలైంది.అదే నెల 14న మరో రెండు కేసులు వచ్చాయి. తర్వాత వరుసగా పెరిగిపోయాయి. ఆ నెలాఖరుకు 25 మందికి, ఏప్రిల్‌లో 519, మేలో 876 మందికి పాజిటివ్‌ గా తేలింది. అన్‌ లాక్‌ మొదలైన జూన్‌ 1 నుంచి ఆదివారం (జూన్‌ 21) వరకు 4,143 కేసులు నమోదయ్యాయి. అంటే తొలి మూడు నెలల్లో1,420 మందికి పాజిటివ్‌ తేలగా.. ఈ నెల 20 రోజుల్లోనే నాలుగు వేల మందికిపైగా వైరస్ సోకింది. టెస్టుల సంఖ్య పెంచుతామన్న సర్కారు.. కొద్ది రోజులుగా సిటీలో ఎనిమిది చోట్ల శాంపిళ్లు సేకరించడం మొదలుపెట్టింది. ఈ నెల 18న 2,250 శాంపిళ్లు సేకరించగా.. అందులో 14.62 శాతం మందికి, 19న 2,520 శాంపిళ్లలో 19.24 శాతం మందికి, 20న తీసిన 2,132 శాంపిళ్లలో 30.4 శాతం మందికి వైరస్ కన్ఫామ్ అయింది. అంటే టెస్టులు చేసిన కొద్దీ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్తున్నాయి. వాళ్లు ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయట తిరిగి ఉండటంతో ఇంకెందరికి వైరస్ సోకి ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రేసింగ్, టెస్టింగ్ నిర్లక్ష్యంతో..

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో ఆందోళనకర స్థాయిలో కేసులు బయట పడడానికి తొలి దశలో ట్రేసింగ్‌, టెస్టింగ్ విషయంలో చేసిన నిర్లక్ష్యమే కారణమని డాక్టర్లు , ఎక్స్ పర్టులు చెప్తున్నారు. నిజానికి తొలిదశలో అధికారులు గట్టిగా పనిచేశారు. పాజిటివ్ కేసులొచ్చిన ఏరియాలను కంటెయిన్మెంట్ చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా ఎవరెక్కడ తిరిగారో ఆరా తీశా రు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది కంటెయిన్ మెంట్లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో రోజూ డిసిన్ఫెక్షన్‌ స్ప్రే చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సర్కారు టెస్టులు చేయడం ఆపేసింది. ట్రేసింగ్లో సీరియస్ నెస్ తగ్గింది. లాక్ డౌన్ ముగిశాక అయితే పూర్తిగా వదిలేశారు. ప్రైమరీ కాంటాక్టులనూ పట్టించుకోలేదు. దుకాణాలు ఓపెన్ కావడంతో జనం తిరగడం మొదలైంది. వైరస్ మరింతగా వ్యాపించింది. అసలు ఎవరికి వైరస్ ఉందో, ఏ ఇల్లు కంటెయిన్ మెంటో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడైనా టెస్టులు పెంచితే..

పాజిటివ్‌ కేసుల కాంటాక్టులను ట్రేస్‌ చేసే విషయంలో రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది. ఈ స్టేజీలో ట్రేసింగ్ సాధ్యపడదనుకుంటే టెస్టుల సంఖ్య పెంచడమే పరిష్కారమని ఎక్స్‌ పర్టులు చెప్తున్నరు. పది రోజుల్లో50 వేల టెస్టులు చేస్తామని సర్కారు ఇటీవల ప్రకటించింది. అధికారుల లెక్కలు చూస్తుంటే.. రోజూ రెండు వేలకు మించి చేస్తలేరు. ఈ నెల 17న 1,375 శాంపిళ్లు, 18న 2,250, 19న 2,320 శాంపిళ్లు సేకరించ గా, 20న 2,132 శాంపిల్స్ తీసుకున్నారు. 21న (ఆదివారం) తీసుకున్న శాంపిళ్లు వందకు మించి లేవని హెల్త్ డిపార్ట్ మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన సర్కారు చెప్పిన మేర టెస్టులు ఎప్పటి వరకు చేస్తరో అన్న సందేహాలు వస్తున్నాయి.

 వారానికి వారం భయమే..

గ్రేటర్‌ హైదరాబాద్ లో వారం వారం కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. జూన్‌ తొలివారంలో 767 పాజిటివ్‌ వస్తే.. రెండో వారంలో 1,060 మందికి చేరింది. మూడో వారంలో డబులై 2,316 మందికి పాజిటివ్ వచ్చింది.

 అన్ని సర్కిళ్లలో కొత్తగా కేసులు

తొలి దశలో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకే కరోనావ్యాప్తి పరిమితమైంది. మధ్యలో దాదాపు అన్ని జోన్లకు విస్తరించినా తర్వాత ఒక్క జోన్‌ కే పరిమితమై నట్టుసర్కారు ప్రకటించింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి ఆందోళకరంగా కనిపిస్తోంది. అన్ని జోన్లలోనూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ వస్తోంది.

కరోనాతో మరో డాక్టర్ మృతి

కరోనాతో మరో డాక్టర్ (77) మృతి చెందారు. తీవ్రమైన జ్వరం, జలుబుతో జూన్ 16న కిమ్స్ హాస్పిటల్‌లో చేరిన ఆయన.. ట్రీట్‌మెంట్‌ పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఖైరతాబాద్‌లోని లైబ్రరీ వెనకాల 20 ఏళ్లుగా ప్రైవేట్‌ క్లినిక్‌లో ఈయన ప్రాక్టీస్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రాక్టీస్‌ మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయినా వైరస్‌ ఎలా సోకిందో తెలియడం లేదు.