
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధిక్ నగర్లో మంగళవారం మాదాపూర్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో ఒక దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో సుమారు 300 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పోలీసులు పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో గుట్కా ప్యాకెట్లు, భారీగా మద్యం సీసాలు, అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 40 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.
వీటితో పాటు, సరైన పత్రాలు లేని 40 బైక్లు, ఒక కారు, మరియు ఒక ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు అరెస్ట్ చేయబడిన దొంగపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు.
►ALSO READ | హైదరాబాద్లో కలకలం రేపిన ఘటన.. బుధవారం ఖైరతాబాద్ బంద్ ?
హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో గత నెలలో కూడా పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక్ నగర్లో సుమారు160 మంది పోలీస్ సిబ్బందితో ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో భాగంగా 51 బైకులు, అనుమతి లేకుండా అమ్ముతున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డీసీపీ పద్మజా రెడ్డి మాట్లాడుతూ బస్తీలలో అన్నిచోట్ల పోలీసులతో కలిసి కాలనీ వాసులు సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని.. తద్వారా జరుగుతున్న నేరాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చని సూచించారు.