బషీర్బాగ్, వెలుగు: టీబీ (క్షయవ్యాధి) రహిత సమాజం కోసం ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటళ్లు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి పిలుపునిచ్చారు. ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కు అనుసంధానంగా కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఓజాస్’ అనే సీఎస్ఆర్ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. టీబీ రోగులకు నిరంతర పోషకాహారం అందించడంతో పాటు, మానసిక సహాయం, కౌన్సెలింగ్ సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్, జగతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దుర్గా కల్యాణి పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల కేంద్రం తనిఖీ
హైదరాబాద్ సిటీ : ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్జరుగుతున్న మౌలానా ఆజాద్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని సోమవారం కలెక్టర్ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో సోమవారం ఇంటర్ ఫస్టియర్పరీక్షలకు 91,029 మంది హాజరయ్యారని, 5048 మంది గైరాజరయ్యారని ఇంటర్మీడియట్ ఆఫీసర్ఒడ్డెన్న..కలెక్టర్ కు వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ అరుంధతి, సీసీఓ శివరామకృష్ణ పాల్గొన్నారు.
