హైదరాబాద్ సిటీ, వెలుగు: రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్స్, దవాఖానలకు రూ.50 వేల ఫైన్ విధించాలని అధికారులను హైదరాబాద్కలెక్టర్ప్రియాంక ఆల కోరారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పీసీ అండ్ పీఎన్డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాల అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సంబంధించిన సేవలను ప్రభుత్వం త్వరలో ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు.
రిజిస్ట్రేషన్లేకుండా నడుస్తున్న క్లినిక్స్కు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోతే రూ .2 లక్షల ఫైన్విధించాలన్నారు. జిల్లాలో స్కానింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సెంటర్లను సంబంధిత యూపీహెచ్సీ పరిధిలో మ్యాపింగ్ చేసి, వారి పర్యవేక్షణలో ఉంచాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అశ్విత రెడ్డి, డాక్టర్ జయశ్రీ, కమిటీ సభ్యులు డాక్టర్ ఐలయ్య పాల్గొన్నారు.
