హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన భారీ ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. నగర కమిషనర్, హైడ్రా చీఫ్ ఎవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 8 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడ్డదారులు తొక్కాయి. ఏకంగా హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లను సృష్టించి మోసానికి పాల్పడ్డాయి.
తాము సృష్టించిన ఆ నకిలీ ఎన్ఓసీ పత్రాలను ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. అయితే అధికారుల తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలు కావడంతో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డు వర్గాలు ఫిర్యాదు చేశాయి.
ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నకిలీ పత్రాల తయారీ, సంతకాల ఫోర్జరీ కోణంలో రంగంలోకి దిగిన పోలీసులు... ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు అనేదానిపై దర్యాప్తును తీవ్రతరం చేశారు.
ఫోర్జరీ చేసిన కాలేజీలు
- మెహిదీపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్
- విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్
- చంద్రాయన్ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
- చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్
- శివరంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్
- తెల్లాపూర్ లోని వశిష్ట జూనియర్ కాలేజ్
- బరకత్ పురాలోని హైందవి జూనియర్ కాలేజ్
- ఎస్సార్ నగర్ లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్
