
డార్క్ వెబ్ ద్వారా నడుస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పట్టుకున్నామని తెలిపారు. ఈ ముఠా సభ్యులు డార్క్ వెబ్ వాడుతూ, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని.. మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికి వరకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. అలాగే డ్రగ్స్ వినియోగిస్తున్న 30 మందిని గుర్తించామని సీపీ చెప్పారు. రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందినవారు ఈ వినియోగదారుల లిస్టు లో ఉన్నారని స్పష్టం చేశారు.
వారంతా సంపన్నులే
డ్రగ్స్ వినియోగదారులపై కూడా కేసులు పెడుతున్నామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా ఉన్నత చదువులు చదివి, సంపన్నులుగా ఉన్నవారే అన్నారు. వారి నుంచి 140 గ్రామ్స్ చరస్, 1450 గ్రామ్స్ గాంజా, 184 బ్లాట్స్ LSD, 10 గ్రామ్స్ MDMA స్వాధీనం చేసుకున్నామన్నారు. వినియోగదారులు వీటిని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ చేసుకుంటూ.. క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ నెట్ వర్క్ కి లీడర్ నరేంద్ర ఆర్య.. ఇతను గోవాలో ఉంటూ నెట్ వర్క్ నడిపిస్తున్నాడు. ఇతనికి దేశవ్యాప్తంగా 4 వేల వినియోగదారులున్నారు.. మన దగ్గర హైదరాబాద్ లో ఐదుగురు వినియోగదారులున్నారు సీపీ తెలిపారు. ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ ద్వారా డ్రగ్స్ ని పంపిస్తున్నారు. కొరియర్ ఏజెన్సీలు కూడా స్కానర్స్ పెట్టుకొని కొరియర్స్ లో ఏమున్నాయో చూసుకోవాలని సీపీ సూచించారు.
సీఎం ఆదేశాలతో స్పెషల్ ఫోకస్
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఘటన తర్వాత సీఎం ఆదేశాలతో డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని సీపీ ఆనంద్ తెలిపారు. H-NEW ఏర్పడ్డ తర్వాత 58 డ్రగ్ కేసులు పెట్టారు.. 285 మందిని అరెస్ట్ చేయించారన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మాలంటే భయం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కావాలనుకునేవారు గోవా, బెంగుళూరు లాంటి నగరాలకు వెళ్లి డ్రగ్స్ తెచ్చుకుంటున్నారు. డ్రగ్స్ అమ్మే ఇతర రాష్ట్రాలవారిని కూడా అరెస్టు చేస్తామని సీపీ హెచ్చరించారు. ‘‘హైదరాబాద్ పోలీసులు గోవాకి వచ్చి డ్రగ్ పెడలర్స్ ని అరెస్టు చేసి తీసుకొని వెళ్తున్నారు.. కానీ సోనాలి ఫోఘాట్ మృతిపై గోవా పోలీసులు, సీఎం మాత్రం మాకేమి తెలియదన్నట్లు ఉంటున్నారు’’ అని అక్కడి లోకల్ పేపర్స్ ప్రశంసించిన విషయాన్ని సీపీ గుర్తుచేశారు. పెడ్లర్స్ మామూలు కొరియర్స్ లాగా డ్రగ్స్ ని కొరియర్స్ లో పంపుతున్నారని.. నెల రోజుల్లో 600 మంది డ్రగ్ యూజర్స్ ని గుర్తించామని తెలిపారు. ఎక్కువగా స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులే ఉన్నారు సీపీ వెల్లడించారు. 231 డ్రగ్స్ వినియోగదారులకు రిహాబిలిటేషన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై దృష్టి ఉంచాలని.. వారు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని సీపీ సూచించారు.