
- హైదరాబాద్లో భారీ వర్షం
- శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత
- సెల్లార్లు, ఇండ్లలోకి వరద.. నీట మునిగిన ఆర్వోబీలు
హైదరాబాద్ సిటీ/చందానగర్, వెలుగు: హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున, రాత్రి దంచికొట్టింది. తెల్లవారుజామున శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వాన కురిసింది. అత్యధికంగా హెచ్సీయూ వద్ద 14.83, లింగంపల్లిలో 11.40, చందానగర్లో 10.93, గచ్చిబౌలిలో 8.13 సెంటమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చందానగర్, మియాపూర్ మదీనాగూడలోని పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వరద వచ్చింది. అపార్ట్మెంట్ వాసులు వరద నీళ్లను మోటార్లతో తోడి బయటకు పోశారు. మదీనాగూడలో నాలాలో కారు కొట్టుకురాగా, ట్రాఫిక్పోలీసులు దాన్ని బయటకు తీశారు. వేముకుంటలో ఇండ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో సామగ్రి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లింగంపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్వోబీ) మళ్లీ నీట మునిగింది. చందానగర్ రైల్వే అండర్ పాస్ కూడా వరదలో మునిగిపోయింది. దీంతో సమీప కాలనీల వాసులు చందానగర్, లింగంపల్లి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బంజారాహిల్స్, కూకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, సరూర్నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్లో 4.18, హిమాయత్నగర్ 3.65, ఓయూ 3.38, వనస్థలిపురం 3.28, హయత్నగర్3.13, బండ్లగూడలో 3.05 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శేరిలింగంపల్లికి హైడ్రా చీఫ్..
భారీ వర్షానికి శేరిలింగంపల్లిలో వరద చేరిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. డోయన్స్ కాలనీ, లింగంపల్లి ఆర్వోబీ ప్రాంతాలకు వెళ్లారు. ఎగువ నుంచి వచ్చిన వరద గోపీ చెరువుకు చేరే మార్గం లేక శేరిలింగంపల్లి మున్సిపల్ ఆఫీసు రోడ్డు, కాలనీని ముంచెత్తినట్టు గుర్తించారు. కొండాపూర్లోని కాసోరోస్ అపార్ట్మెంట్పరిసరాలను పరిశీలించారు.