గ్రూప్‌‌-1లో అక్రమాలు జరగలేదు.. హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన

గ్రూప్‌‌-1లో అక్రమాలు జరగలేదు.. హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌(టీజీపీఎస్సీ) తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి, అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున దేశాయ్‌‌ ప్రకాశ్‌‌రెడ్డి వాదిస్తూ.. పరీక్షలు రూల్స్‌‌ ప్రకారం పారదర్శకంగా జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగలేదని.. పరీక్షలను చీఫ్‌‌ ఎగ్జామినర్‌‌ పర్యవేక్షించారని చెప్పారు. అభ్యర్థుల సౌలభ్యం కోసమే పరీక్షా కేంద్రాలను పెంచామని..నిర్వహణా సౌలభ్యం కోసం ప్రిలిమ్స్‌‌కు, మెయిన్స్‌‌కు వేరువేరు హాల్‌‌టిక్కెట్‌‌లను జారీ చేయాల్సివచ్చిందని వివరించారు.

 పేపర్‌‌ లీకేజీ, కాపీయింగ్‌‌ జరిగిందనే ఆరోపణల్లో నిజం లేదని.. పరీక్షలకు ముందే రెండు హాల్‌‌టిక్కెట్‌‌ల గురించి కమిషన్‌‌ వెల్లడించిందని తెలిపారు. ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్‌‌ వేయడం చెల్లదన్నారు. కోఠి మహిళా కాలేజీలోని 18, 19 సెంటర్లలో కేవలం మహిళలకే కేటాయించడాన్ని తప్పుబట్టడం కరెక్ట్ కాదన్నారు.  సుమారు 4 గంటలపాటు వాదనలు విన్న చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌లతో కూడిన బెంచ్‌‌.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.