
హైదరాబాద్ లో కుక్కలు రెచ్చిపోతున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని శాంతి నగర్ లో ఐదేండ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన మరవకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బొరబండలో బాలుడిపై ఆదివారం(డిసెంబర్ 17) కుక్క దాడి చేసింది.
వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై పెంపుడు కుక్క దాడికి పాల్పడింది. దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలుడి తండ్రి కుక్క కాటుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
కాగా చిన్న పిల్లలను టార్గెట్ గా కుక్కలు దాడికి పాల్పడుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి వార్తలే వినాల్సి వస్తోందని అంటున్నారు.. ఇలాంటి వార్తలు నిత్యం చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాబట్టి ఇకనైనా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.