
సికింద్రాబాద్, వెలుగు : సిటీలో ఇరానీ చాయ్ అంటే తెలియని వారుండరు. బిర్యానీ తిన్న తర్వాత అయినా, పని ఒత్తిడి అయినా, ఫ్రెండ్స్ తో కాలక్షేపానికి అయినా అందుబాటు ధరల్లో చాయ్ దొరికే ఇరానీ చాయ్ కెఫేలే అడ్డాలు. సిటీకి కొత్తగా వచ్చిన వాళ్లు ఇక్కడి ఇరానీ చాయ్ను టేస్ట్ చేయకుండా వెళ్లరు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న ఇరానీ టీకి కూడా జీఎస్టీ వేడి తగిలి రేటు పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్, పాల ప్యాకెట్లపై జీఎస్టీ ఎఫెక్ట్ తో సిటీలో చాలా చోట్ల ఇరానీ టీతో పాటు మూములు చాయ్ రేట్లు కూడా పెరిగాయి.
ఇందుకు పాల ప్యాకెట్ రేటు పెరగడమే కారణమని చాయ్వాలాలు అంటున్నారు. గతంలో ఇరానీ ఫుల్ చాయ్ రూ.15 ఉన్న ఉండగా.. చాలా సెంటర్లలో ఇప్పుడు రూ.20 చేశారు. ఇప్పటికే సిటీలో సాధారణ హోటళ్లలో రూ.8 , రూ.10 కి రెగ్యులర్ చాయ్ ఉండేది. కానీ ఇప్పుడు మినిమమ్ రూ. 12 నుంచి 15 వరకు పెరిగింది. ఇటీవల అన్ని రకాల పాల ఉత్పత్తులపై రూ.2 నుంచి రూ.4 వరకు రేటు పెరిగింది. ఇంతకుముందు లీటర్ విజయ పాల ప్యాకెట్ రేటు రూ.48 ఉండగా, ఇపుడు రూ.52 అయ్యింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కప్పు చాయ్ రూ.20 చేయాల్సి వచ్చిందని హోటల్ ఓనర్లు చెప్తున్నారు.