
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో రియల్టీ రంగం పరిస్థితి దారుమంగా ఉంది. నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య భారీగా పెరగటంపై బిల్డర్లు, రియల్టీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో 5లక్షల 59వేల ఇళ్లు అమ్ముడుపోకుండా ఉన్నట్లు అనరాక్ సంస్థ అందించిన తాజా రిపోర్ట్ వెల్లడించింది.
ప్రస్తుతం మెట్రో నగరాల్లో రియల్టీ బూమ్ కొంత మందగమనాన్ని చూస్తుండటంతో కొనేవారి కంటే కట్టిన ఇళ్ల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పరిస్థితులు దారుమంగా ఉన్నాయి. నగరంలో సరసమైన గృహాలకు డిమాండ్ లేకపోవటంతో అమ్ముడు కాని ఫ్లాట్స్ సంఖ్య 98వేలకు చేరుకుంది. దేశంలో ఏ నగరంలోనూ సరసమైన గృహాల విషయంలో ఇంత దారుణంగా లేదు. అమ్ముడుపోని నివాసాల సంఖ్య 177 శాతం పెరగటంతో 5 ఏళ్ల గరిష్ఠాన్ని తాకింది.
ఇక ఇతర నగరాల విషయానికి వస్తే.. ముంబైలో లక్ష 80వేల అమ్ముడుపోని నివాసాలు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 84వేలకు పైగా అమ్ముడుపోని ఇళ్లు ఉన్నట్లు వెల్లడైంది. బెంగళూరులో 58వేల 700 ఇళ్లు, పూణేలో 81వేల 400 ఫ్లాట్స్ అమ్ముడుపోకుండా నిలిచిపోయాయి. అయితే బెంగళూరు నగరంలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇక చెన్నై నగరంలో అమ్ముడుపోని ఇళ్లు 29వేలు, కలకత్తాలో 28వేల వద్ద తక్కువ ఇన్వెంటరీతో కొనసాగుతున్నాయి.
ప్రజలు కరోనా తర్వాత అఫోర్డబుల్ నివాసాల కంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. పైగా డెవలపర్లు సైతం అధిక లాభాల కోసం ఎక్కువగా లగ్జరీ ప్రాజెక్టులనే లాంచ్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు భారీగా లగ్జరీ ఇళ్ల కొనుగోలు చేయకపోవటంతో డిమాండ్ కంటే సప్లై పెరిగి ఖాళీగా ఉంటున్న ఇళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల చేతిలో ఖర్చు చేసే డబ్బు కూడా తగ్గటంతో ఇల్లు కొనటం కంటే అద్దె ఇంట్లో ఇండటం మేలని చాలా మంది భావించటం కూడా డిమాండ్ తగ్గటానికి కారణంగా తెలుస్తోంది.