
కలియుగ వైకుంఠం తిరుమల పట్ల అందరికి పవిత్ర భావన ఉంటుంది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు భక్తులు. అంతటి పవిత్రత గల తిరుమల ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ హైవే దగ్గర ఉన్న రాయుడుగారి మిలిటరీ హోటల్ యాజమాన్యం ఈ నిర్వాకానికి పాల్పడింది. ఈ నాన్ వెజ్ హోటల్లో తిరుమల ఆలయ గర్భగుడి నమూనా ఉంచడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్.
రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే హైవేపై రాయుడుగారి మిలిటరీ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా నిర్మించడం దారుణమని.. హోటల్ యాజమాన్యం ఏకంగా తిరుమలలో అన్నదానం లాగా మేము కూడా అన్నదానం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు కిరణ్ రాయల్.
వ్యాపారం కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదని.. దీనిపై కఠిన చర్యలు తీసుకొని గుడి నమూనాను తొలగించాలని కోరారు కిరణ్ రాయల్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ వింగ్ ఏర్పాటు చేయాలని.. సోషల్ మీడియా మీద కూడా నిఘా ఉంచాలని కోరారు.