
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది న్యూజిలాండ్ తో జరిగే వన్డే, టీ20 సిరీస్ కు సంబంధించిన వేదికలను శనివారం (జూన్ 14) జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది మ్యాచుల్లో హైదరాబాద్ కు ఒక్కటి కూడా కేటాయించకుండా మరోసారి హ్యాండిచ్చింది. జనవరి 11న జరిగే తొలి వన్డేకు బరోడా ఆతిథ్యమివ్వనుంది. జనవరి 14. 18న వరుసగా రాజ్కోట్, ఇండోర్ మిగతా రెండు వన్డేలు జరగనున్నాయి.
ఐదు టీ20 మ్యాచ్లను నాగూర్ (21), రాయ్పూర్ (23), గువహటి (25), విశాఖపట్నం (28), తివేంద్రం (31)లో నిర్వహించనున్నారు. ఇక 2025-26 రంజీ ట్రోఫీని అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్య కాలంలో రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈసారి ఫార్మాట్ లోనూ మార్పులు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్లేట్ గ్రూప్ నుంచి ఒక్క జట్టుకు మాత్రమే ప్రమోషన్ ఉంటుంది.
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు దులీప్ ట్రోఫీని జోనల్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఈ జట్లను జోనల్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం సూపర్ లీగ్ను ప్రవేశపెట్టారు. ప్లేట్ గ్రూప్ను మళ్లీ తీసుకొచ్చారు.