
హైదరాబాద్ సిటీ/కరీంనగర్ క్రైం, వెలుగు: పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్లో ఇద్దరు ఏఈలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ కాప్రా సర్కిల్–-1 ఆఫీస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.స్వరూప కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ చేసిన పనిని ఎంబీలో రికార్డ్ చేసేందుకు ఏఈ రూ.1.20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, వారి సూచనల మేరకు మంగళవారం ఆమెకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్లో ఏఈ, సీనియర్ అసిస్టెంట్..
అద్దె వాహనాల బిల్లు చెల్లించేందుకు కరీంనగర్ జడ్పీలో పంచాయతీరాజ్ విభాగంలో పని చేస్తున్న ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. జడ్పీలో ఓ వ్యక్తి తన వాహనం అద్దెకు పెట్టాడు. అతడికి 10 నెలల బిల్లు ఇవ్వాల్సి ఉండగా, 4 నెలల బిల్లు చెల్లించారు. మిగిలిన 6 నెలల బిల్లు ఇచ్చేందుకు రూ.8 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ఆఫీస్ లో డబ్బులు ఇవ్వగా, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.