ఏసీబీకి పట్టుబడిన ఏఈలు .. హైదరాబాద్లో ఎంబీ రికార్డ్ కోసం రూ.1.20 లక్షలు డిమాండ్

ఏసీబీకి పట్టుబడిన ఏఈలు .. హైదరాబాద్లో ఎంబీ రికార్డ్ కోసం రూ.1.20 లక్షలు డిమాండ్

హైదరాబాద్​ సిటీ/కరీంనగర్​ క్రైం, వెలుగు: పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్​లో ఇద్దరు ఏఈలు, ఒక సీనియర్​ అసిస్టెంట్​ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్  మహా నగర పాలక సంస్థ  కాప్రా సర్కిల్–-1 ఆఫీస్​లో అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్​ బి.స్వరూప కాంట్రాక్టర్​ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్​ చేసిన పనిని ఎంబీలో రికార్డ్​ చేసేందుకు ఏఈ రూ.1.20 లక్షలు డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, వారి సూచనల మేరకు మంగళవారం ఆమెకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్​లో ఏఈ, సీనియర్​ అసిస్టెంట్.. ​ 

అద్దె వాహనాల బిల్లు చెల్లించేందుకు కరీంనగర్  జడ్పీలో పంచాయతీరాజ్​ విభాగంలో పని చేస్తున్న ఏఈ శరత్, సీనియర్​ అసిస్టెంట్​ వేణుగోపాల్  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. జడ్పీలో ఓ వ్యక్తి తన వాహనం అద్దెకు పెట్టాడు. అతడికి 10 నెలల బిల్లు ఇవ్వాల్సి ఉండగా, 4 నెలల బిల్లు చెల్లించారు. మిగిలిన 6 నెలల బిల్లు ఇచ్చేందుకు రూ.8 వేలు డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ఆఫీస్ లో డబ్బులు ఇవ్వగా, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్  సిబ్బందితో కలిసి ఏఈ శరత్, సీనియర్  అసిస్టెంట్  వేణుగోపాల్ ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.