ట్యాంక్ బండ్ పరిసరాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

ట్యాంక్ బండ్ పరిసరాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైదరాబాద్ : లక్టీకపూల్.. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దసరా పండుగ ముగియడంతో జిల్లాలతో పాటు ఏపీ నుంచి జనం సిటీకి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయింది. అమీర్ పేట్ లో కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు నవరాత్రులు ముగియడంతో దుర్గామాత  విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు హుస్సేన్ సాగర్ కు తీసుకువస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సిటీని వర్షం వదలడం లేదు. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షం..మరోవైపు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు కష్టాల వర్ణనాతీతంగా మారాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్నారు. సరైన సమయానికి కార్యాలయాలకు వెళ్లలేక.. వర్షంలో తడుస్తూ..ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు వర్షాన్ని లెక్కచేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.