హైదరాబాద్: రాగల మూడ్రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతోనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించింది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని… ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని నీటిపారుదల రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.