
- రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం
- మిస్ వరల్డ్ పోటీలూ జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్
- డిఫెన్స్ సంస్థలు, ఎయిర్ఫోర్స్, ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీల వద్ద టైట్ సెక్యూరిటీ
- కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో హైఅలర్ట్ప్రకటించారు. రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పాటు మిస్వరల్డ్పోటీలు కూడా జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. గతంలో నమోదైన కమ్యూనల్ కేసుల ఆధారంగా ఆయా వ్యక్తుల కదలికలనూ నిరంతరం గమనిస్తున్నారు. కాగా, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో రాష్ట్ర పోలీస్ఉన్నతాధికారులు నిరంతరం టచ్లో ఉంటున్నారు. కింది స్థాయి పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఆఫీసర్గా నియమించింది.
సెక్యూరిటీ టైట్..
హైదరాబాద్లో డిఫెన్స్ సంస్థలు, ఎయిర్ఫోర్స్, ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. దుండిగల్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్, హకీంపేట్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, గోల్కొండలోని ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లు, కంచన్బాగ్ పరిసర ప్రాంతాల్లోని డీఆర్డీవో, డీఆర్డీఎల్, బీడీఎల్, మిథాని, ఆర్సీఐ, ఏఆర్సీఐ సహా డిఫెన్స్ సంస్థల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్, అమెరికన్ ఎంబసీ సహా మిస్వరల్డ్కంటెస్టెంట్లు, విదేశీ టూరిస్టులు బస చేసే హోటళ్ల వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో స్థానిక పోలీసులు నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు.
టూరిస్ట్ ప్లేసులపై ఫోకస్..
ఈ నెల 10 నుంచి హైదరాబాద్కేంద్రంగా మిస్వరల్డ్పోటీలు జరగనున్నాయి. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్తరలివస్తుండటంతో వాళ్లు బస చేసే హోటళ్ల వద్ద ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు కంటెస్టెంట్స్సందర్శించనున్న 22 పర్యాటక ప్రాంతాల్లో ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. అనుమానితులపైనా నిఘా పెడుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్తో పాటు పర్యాటక ప్రాంతాలు, జన సంచారం ఉండే ప్రదేశాల్లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు, బెలూన్లు, ఇతర రిమోట్ కంట్రోల్డ్ ఏరియల్ వెహికల్స్ను ఎగరేయడంపై నిషేధం విధించారు. ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగించేవారికి ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, ఖిల్వత్, శాలిబండలో అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా మిస్వరల్డ్పోటీలు ప్రారంభ వేడుకలు నిర్వహించే హెటెక్స్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో కంటెస్టెంట్లకు భద్రత కల్పిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా హెటెక్స్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని స్థానిక కంట్రోల్ రూమ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించారు. సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్స్ను అప్రమత్తం చేశారు. ఫేక్ న్యూస్ను గుర్తించి వెంటనే తొలగించడంతో పాటు సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తరలివస్తున్న కంటెస్టెంట్స్..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు కంటెస్టెంట్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తున్నారు. బుధవారం ఒక్క రోజే దాదాపు 70 దేశాల నుంచి కంటెస్టెంట్స్హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా, జర్మనీ, ట్రినిడాడ్, ఎస్టోనియా, పరాగ్వే, చెక్ రిపబ్లిక్, సోమాలియా, ఇటలీ, ఫిలిప్పీన్స్, మయన్మార్, వియత్నాం తదితర దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్కు శంషాబాద్ఎయిర్పోర్టులో అధికారులు స్వాగతం పలికారు.