
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో బుధవారం (సెప్టెంబర్ 17) వర్షం దంచికొట్టింది. సాయంత్రం 4 గంటల నుంచి శివారుల్లో వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాన్స్టాప్ వాన కురిసింది.
ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్తున్నారు. మెయిన్రోడ్లు మొదలుకుని ఇంటర్నల్రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్ట్యాంక్, చింతల్బస్తీ, లోయర్ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించారు.
మెట్టుగూడ డివిజన్ విజయపురి కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. సీతాఫల్మండిలో ప్రహరీ గోడ కూలిపోవడంతో పక్కనే ఉన్న నాలా నీళ్లు ఇండ్లలోకి వచ్చాయి.