హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ ప్రజలకు సుస్థిర ప్రయాణంతో పాటు పర్యావరణహిత ప్రజా రవాణా అందించేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ– డ్రైవ్ పథకంలో భాగంగా హైదరాబాద్ నగరానికి 1,085 బస్సులు రానున్నాయి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్ ) బస్సులను సరఫరా చేయనుంది. వీటి రాకతో నగరంలో సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 3,200 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇందులో 325 బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలు కాగా త్వరలో మరో 175 బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు చార్జింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఒక్కో బస్సు ఫుల్ చార్జి కావడానికి 90 నిమిషాలు పడుతోంది. దీంతో 200 కి.మీ. మేరకు మాత్రమే అవి నడుస్తాయి. కొత్తగా వచ్చే ఈవీ బస్సులు 45 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతాయి. అంతేకాకుండా 250 కి.మీ. వరకూ పనిచేస్తాయి” అని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న బస్సుల ఫ్లోర్ హైట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు, వృద్ధలు ఎక్కడానికి కొంత ఇబ్బంది పడుతున్నారని, కానీ, కొత్త బస్సుల ఫ్లోర్డిజైన్ భూమికి 400 మి.మీ. ఎత్తులోనే ఉందని చెప్పారు. దీంతో పిల్లలు, వృద్దులు బస్సు ఎక్కడానికి సులభంగా ఉంటుందన్నారు. బస్సుల తయారీ సంస్థ రాబోయే 20 నెలల్లో విడతల వారీగా బస్సులను సరఫరా చేస్తుందని వెల్లడించారు.
