దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ ప్లేస్లో ఉంచడమే తమ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సిటీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో విదేశాల మాదిరిగా రూపురేఖలు మారాయని అన్నారు. రంగారెడ్డి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్పై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను కేటీఆర్ ప్రారంభించారు. కోకాపేట్ నుంచి శంషాబాద్ వరకూ మొత్తం 136 కిలోమీటర్ల దూరం రోడ్డుకి రెండు వైపులా లైటింగ్ను ఏర్పాటు చేశారు. రూ.100 కోట్ల 22 లక్షలతో ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేటీఆర్. దేశంలోని ఏ నగరంలో ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు లేదన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగబోతుందన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.