- చోరీలు జరగకుండా
- ఆయా ఏరియాల్లో పెట్రోలింగ్
- పాత నేరస్తులపై నిఘా
హైదరాబాద్,వెలుగు: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారి ఇండ్లకు గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల సీపీలు సెక్యూరిటీని పెంచారు. చోరీలకు చెక్ పెట్టేందుకు ప్రాపర్టీ అఫెండర్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, శివారు ప్రాంతాల్లో బ్లూకోల్ట్స్,పెంట్రోలింగ్ సిబ్బంది రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పెట్రోలింగ్ చేస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో సిటీలో జరిగిన వరుస చోరీలతో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ టైమింగ్ ను పెంచారు. శని,ఆది,సోమవారాల్లో మరింత అలర్ట్గా ఉండాలని స్థానిక పోలీసులను సీపీలు ఆదేశించారు.
కేస్ స్టడీస్తో సేఫ్టీ ప్రికాషన్స్
సిటీలోని కమర్షియల్ కాంప్లెక్స్లు,అపార్ట్మెంట్స్తో పాటు శివారు ప్రాంతాల్లోని కాలనీలు,గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాస్పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గతేడాది సంక్రాంతి సెలవుల్లో జరిగిన చోరీ కేసులను స్టడీ చేశారు. దొంగల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. అంతర్రాష్ట్ర ముఠాల షెల్టర్కి అవకాశాలు ఉన్న రైల్వే స్టేషన్స్,లాడ్జిలు కస్టమర్ల డేటా కలెక్ట్ చేశారు. ఏపీతో పాటు రాష్ట్రంలోని జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి ఉంటోన్న వారి కాలనీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఆన్లో ఉండేలా స్థానిక అసోసియేషన్స్,అపార్ట్మెంట్ వాసులకు సూచిస్తున్నారు. క్రైమ్ మ్యాపింగ్ యాప్ ద్వారా చోరీలకు అవకాశమున్న ఏరియాలను గుర్తించారు. 3 నెలల వ్యవధిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్లు, చోరీల విధానాన్ని స్టడీ చేశారు. పాత నేరస్థులపై నిఘా పెట్టారు. వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన వారి కదలికలను లోకల్ పోలీసులతో కలిసి మానిటరింగ్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి ఇంటి ఓనర్లను సంప్రదిస్తున్నారు. చుట్టుపక్కల ఇండ్ల వారు పరిసర ప్రాంతాలను గమనించేలా ఏర్పాట్లు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు.
స్పెషల్ పెట్రోలింగ్ ఏర్పాటు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారం రోజులుగా స్పెషల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. పబ్లిక్ మూవ్ మెంట్ తక్కువగా ఉండే కాలనీల్లో పోలీసుల గస్తీ పెంచాం. సొంతూళ్లకు వెళ్లిన వారు తమ ఇంటి
పరిసరాల్లో వారికి కాల్ చేసి అప్పుడప్పుడు అలర్ట్ చేస్తుండాలి. - మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ