V6 News

వచ్చేస్తోంది టీవోడీ ప్రాజెక్ట్.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ప్రోత్సహించడానికి హెచ్ఎండీఏ కొత్త ప్లాన్

వచ్చేస్తోంది టీవోడీ ప్రాజెక్ట్.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ప్రోత్సహించడానికి హెచ్ఎండీఏ కొత్త  ప్లాన్
  • గ్రేటర్​లో ట్రాన్సిట్​ ఓరియెంటెడ్ డెవలప్​మెంట్​ ప్రాజెక్టు
  • మెట్రో స్టేషన్లు, బస్టాండ్లను కలిపేలా సైకిల్​ ట్రాక్​లు, వాక్​వేలు  
  • మొదటిదశలో ఎల్బీనగర్, ఎస్సార్​నగర్​లో అమలు  

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో పబ్లిక్​ట్రాన్స్​పోర్టేషన్​ను ప్రోత్సహించి ట్రాఫిక్​ కష్టాలను తగ్గించడానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ ఉమ్టా నేతృత్వంలో ట్రాన్సిట్​ఓరియెంటెడ్​డెవలప్​మెంట్(టీవోడీ) ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా మెట్రోరైల్, బస్సుల్లో ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్​ఇబ్బందుల్లేకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను మెయిన్​రోడ్​కు కనెక్ట్​చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఇలా అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో వాక్​వేలు, సైకిల్​ట్రాక్​లు, లింక్​రోడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం సిటీలోని మూడు మెట్రో కారిడార్లతో పాటు మెట్రోరెండో దశలో నిర్మించనున్న ఐదు కారిడార్లను కలిపి 8 మార్గాల్లో ఈ టీవోడీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల ఎవరైనా ఇండ్ల నుంచి నేరుగా సైకిల్స్​లేదా బ్యాటరీతో నడిచే వాహనాల్లో లేదా నడుస్తూ మెయిన్​రోడ్​కు చేరుకుని బస్టాండ్​లేదా మెట్రోలో ప్రయాణించొచ్చు. ట్రాఫిక్​ఎక్కువగా ఉన్న ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని నిర్మించడం వల్ల చాలా వరకు ప్రైవేట్​ వాహనాలు, సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు. 

తొమ్మిది కారిడార్లు 

పబ్లిక్​ట్రాన్స్​పోర్టేషన్​మరింత మెరుగు పరిచేందుకు చేపడుతున్న ఈ టీఓడి ప్రాజెక్టులో మొత్తం 9 కారిడార్లను నిర్మించనున్నారు. ముందుగా చేపట్టే ఎల్బీనగర్​, ఎస్​ఆర్​నగర్​తో పాటు నాగోల్​–రాయదుర్గం, ఎల్బీనగర్​–మియాపూర్​, జేబీఎస్​–చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్​–శంషాబాద్​ఎయిర్​పోర్ట్​, మియాపూర్​–బీహెచ్ఈఎల్, రాయదుర్గం– మియాపూర్​, రాయదుర్గం – అమెరికన్​కాన్సులేట్​, ఎల్బీనగర్​–​ హయత్​నగర్, శంషాబాద్​ఎయిర్​పోర్ట్​ – ఫ్యూచర్​సిటీ​ కారిడార్లలోని ప్రాంతాలను టీవోడీ కింద అభివృద్ధి చేయనున్నారు. నిధులను కేంద్ర ప్రభుత్వంలోని స్పెషల్​అసిస్టెన్స్​స్టేట్​క్యాపిటల్​ఇన్వెస్ట్​మెంట్​(సాస్కి) పథకం ద్వారా సేకరించాలని నిర్ణయించారు. 

మొదటి దశలో ఎల్బీనగర్, ఎస్ఆర్​నగర్​ 

ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశల్లో ఎల్బీనగర్, ఎస్​ఆర్​నగర్​ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో వాక్​వేలు, సైక్లింగ్​ట్రాక్స్​, నాన్​ మోటరైజ్డ్​వాహనాల వినియోగానికి స్పెషల్​ ట్రాక్​లు నిర్మించనున్నారు. ఎవరైనా చాలా సులభంగా మెట్రో స్టేషన్​నుంచి ఇండ్లకు చేరుకునేలా లాస్ట్​మైల్​కనెక్టివిటీని ప్రోత్సహించనున్నారు. సైకిళ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగించేలా ప్రత్యేక కారిడార్​ను నిర్మిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో చౌరస్తాలను విస్తరిస్తారు. స్కూల్​ఆఫ్​ప్లానింగ్​అండ్​ఆర్కిటెక్చర్​ఆధ్వర్యంలో ప్లాన్లు రూపొందిస్తున్నారు.