
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా అంటే కూలగొట్టడం కాదని.. పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగరంగా నిలబెట్టడమే లక్ష్యమని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ‘హైడ్రా.. బస్తీతో దోస్తీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం టోలీచౌకిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కబ్జాదారుల విషయంలో మాత్రమే తాము దూకుడుగా ఉంటామని, పేదలకు ఏ సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణతో తమకు సంబంధం లేదని, నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న కబ్జాలను మాత్రమే తొలగించామని చెప్పారు. షేక్పేట, టోలీచౌక్ ప్రాంతంలోని విరాట్నగర్, బసవతారకం నగర్ లో నాలాలను శుభ్రం చేసి ముంపు సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
కింగ్స్వే స్కూల్ను కూల్చేయండి
సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులోని చారిత్రక కింగ్స్వే ప్రభుత్వ స్కూల్ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ బడి శిథిలావస్థకు చేరగా.. మీడియాలో కథనాలు వచ్చాయి.
దీంతో ఆయన పరిశీలించి పిల్లలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హెచ్ఎం, ఎంఈవోకు సూచించారు. పక్కనే ఉన్న మహబూబ్ స్కూల్ ట్రస్టుతో మాట్లాడి కొన్నాళ్ల పాటు ఇక్కడ తరగతి గదులు కేటాయించాలని కోరారు. వచ్చే వారం సెలవుల్లో కూల్చివేతలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.