- ఎమర్జెన్సీ 300, స్టాటిక్ టీమ్స్ 350
- వర్షాలు కురిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ప్రణాళిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా మాన్సూన్ టీమ్స్ సోమవారం నుంచి ఫీల్డ్ లోకి రానున్నాయి. 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 350 స్టాటిక్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. వర్షం కురిసిన వెంటనే రోడ్లపై నిలిచిన నీటిని, విరిగిపడిన చెట్లను తొలగించడంతోపాటు ట్రాఫిక్ను క్లియర్ చేసే పనులను ఇవి చేపట్టనున్నాయి. ఒక్కో టీమ్ లో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు 1800 మంది సిబ్బంది పని చేయనున్నారు.
అలాగే, వర్షపు నీరు నిలిచే చోట రెండు షిఫ్టుల్లో పని చేసేలా 350 స్టాటిక్ టీమ్స్ లో 700 మంది పని చేయనున్నారు. వీటికితోడు 51 హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు పని చేయనున్నాయి. డీఆర్ఎఫ్ ఒక్కో టీమ్లో 18 మంది చొప్పున మొత్తం 918 మంది సేవలందించనున్నారు. వీరు ఒక్కో షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున పని చేస్తారు. ఈ టీమ్స్ అందుబాటులోకి వస్తే వర్షాలు పడిన సమయంలో ఇబ్బందులు తొలగనున్నాయి.
